బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం ముంబయిలోని జుహు ప్రాంతంలో, ఐశ్వర్య నివాసానికి సమీపంలో చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారనే విషయం అధికారికంగా ఇంకా వెల్లడికాలేదు.

ఐశ్వర్యా టీమ్ స్పందన
కారు ప్రమాదానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఓ బస్సు వెనుకనుంచి కారును ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం, ఈ కారు ఐశ్వర్య రాయ్ బచ్చన్దేనని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన వెంటనే ఐశ్వర్య బాడీగార్డులు, ఆమె టీమ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే, ప్రమాద సమయంలో ఐశ్వర్య కారులో లేరని తెలుస్తోంది. ప్రమాదం పెద్దది కాదని, కేవలం చిన్న గాయం మాత్రమే ఏర్పడిందని ఐశ్వర్యా రాయ్ టీమ్ వెల్లడించింది. కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అని ఆమె టీమ్ పేర్కొంది. ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఇటీవల దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడు కోణార్క్ వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకకు బచ్చన్ కుటుంబం మొత్తం హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, అర్ధ్య బచ్చన్ అందరూ ఈ వేడుకలో సందడి చేశారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐశ్వర్యా రాయ్ కారు ప్రమాదానికి గురయ్యిందనే వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె టీమ్ తెలియజేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.