హుజూర్నగర్: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారును ఆపమని డ్రైవర్ కు సూచించారు.
దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

కాగా, ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు కూడా పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తప్పడంతో సిబ్బంది వెంటనే ఆయన్ని మరో కారులో ఖమ్మంకు తరలించారు.