ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి నమ్మించేందుకు ప్రయత్నించాడు. అదును చూసుకుని యువతిని అత్యాచారం చేసి, నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
కంచికచర్లలోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి, సమీప గ్రామం పరిటాలలో తోటి విద్యార్థినులతో కలిసి ఉండేది. అదే గ్రామానికి చెందిన గాలి సైదా అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొద్దిరోజులకే స్నేహం మరింత దగ్గరయ్యింది. దీన్ని ఆసరాగా తీసుకున్న సైదా మాయ మాటలతో యువతిని శారీరకంగా దోపిడీ చేశాడు. దీనితో ఆగకుండా, ఆమెను నగ్నంగా చిత్రీకరించి, వాటిని తన వద్ద భద్రపరిచాడు. ఆ ఫొటోలతో యువతిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతనితో పాటు అతని మిత్రులు కూడా ఈ ఫొటోలు చూసి యువతిని బెదిరించడం ప్రారంభించారు.
ఈ వేధింపులు తట్టుకోలేక యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహం పేరుతో అమ్మాయిలను మోసం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ద్వారా యువతులు అప్రమత్తంగా ఉండాలని, అజ్ఞాత వ్యక్తుల మాటలను నమ్మి తమ జీవితాన్ని ముప్పు పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.