వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తున్న వార్త స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆలుబాక-బోధాపురం మార్గంలో గోదావరి పాయ దగ్గర పులి అడుగుల జాడలు కనిపించడంతో రైతులు అప్రమత్తమయ్యారు. మిర్చి తోటల వద్దకు వెళ్లే రైతులు పులి సంచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి పుచ్చపంట దగ్గర పులి అరుపులు వినిపించాయన్న సమాచారంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగులను పరిశీలించారు.
అధికారుల పరిశీలన ప్రకారం.. ఇది పెద్దపులి అడుగులే అని నిర్ధారణకు వచ్చారు. పులి ఆహారం కోసం సమీప గ్రామాల్లోకి రావచ్చని వారు పేర్కొన్నారు. పులి సంచారం కారణంగా రైతులు రాత్రి పంట పొలాల్లో ఉండడానికి భయపడుతున్నారు. పులి అడుగులు గుర్తించి దానిని అడవిలోకి తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానికులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.