జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్ జీ ట్యాంకర్ ను మరో ట్రక్ వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ లో మంటలు చెలరేగడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో పక్కనే ఉన్న రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.