
Telangana: హనుమకొండ జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి అంతిమయాత్రలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పాల్గొని, అక్కడున్న యువతకు ఆవేదనతో చేసిన హితబోధ అందరినీ కదిలించింది. కాజీపేట పరిధిలో ఓ యువకుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడు.
Read Also: MP DK Aruna: ప్రగతి ప్రణాళిక ఉట్టి బోగస్.. డీకే అరుణ
శవాన్ని చూసైనా మారండి అంటూ యువతకు హితబోధ
ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, మృతుడి స్నేహితులను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. “క్షణకాలపు మత్తు కోసం జీవితాలను పణంగా పెడుతున్నారు. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలై యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు చనిపోతే నష్టపోయేది కేవలం మీ కుటుంబమే. కూలీనాలీ చేసి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న మీ తల్లిదండ్రుల కన్నీళ్లకు ఎవరు సమాధానం చెబుతారు?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పుట్టినా, చచ్చినా, పార్టీల్లో గెలిచినా, ఓడినా.. అన్నింటికీ తాగడమే పనిగా పెట్టుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మిమ్మల్ని అభివృద్ధి మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. మద్యం తాగమని, గంజాయి పీల్చమని ప్రోత్సహించేవాడు స్నేహితుడు కాదు, మీ జీవితాన్ని నాశనం చేసే శత్రువు. అలాంటి చెడు స్నేహాలను వెంటనే వదిలేయండి. చనిపోయిన మీ స్నేహితుడి శవాన్ని చూసైనా మీలో మార్పు రావాలి అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: