పశ్చిమాసియాలో ఇరాన్(Iran) చేస్తున్న దాడులను అమెరికా, గల్ఫ్ దేశాలు ఖండించాయి. ప్రమాదకర స్థాయిలో ఉద్రిక్తతలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు అమెరికా, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ చాలా దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించాయి. ‘సార్వభౌమ దేశాల భూభాగాలపై ఇరాన్ చేసిన దాడులు విచక్షణారహిత, నిర్లక్ష్యమైనవి. ఈ క్షిపణి, డ్రోన్ దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. బహ్రెయిన్, ఇరాక్ (ఇరాకీ కుర్దిస్తాన్ ప్రాంతం సహా), జోర్డాన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపై జరిగిన ఈ దాడులు సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయి. పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయి. పౌర మౌలిక వసతులను ధ్వంసం చేశాయి. ఈ చర్యలు ప్రాంతీయ శాంతి, భద్రతలకు ప్రమాదకరంగా మారాయి. యుద్ధంలో నేరుగా పాల్గొనని దేశాలు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత బాధ్యతారహితమైన చర్య’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
Read Also: US-Israel Strikes : ఒక్కరి చావుకు వందల మంది బలి!

అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమకు ఉన్న స్వీయరక్షణ హక్కును ఈ ఏడు దేశాలు పునరుద్ఘాటించాయి. ‘మా పౌరులు, సార్వభౌమాధికారాన్ని, భూభాగాన్ని రక్షించడంలో మేమంతా ఐక్యంగా నిలుస్తాం. అదేవిధంగా గగనతల, క్షిపణి రక్షణ వ్యవస్థల సమన్వయం వల్ల మరింత ప్రాణనష్టం, విధ్వంసం నిరోధించింది’ అని తెలిపాయి. ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా బహ్రెయిన్, యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్, బహ్రెయిన్ యూఏఈ నాయకులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో ఐర్జీసీ దళాలు వెయ్యి మందికిపైగా అమెరికన్లను హతమార్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సహా యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించిన భారీ దాడుల నేపథ్యంలో యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఇరాన్ నుంచి వచ్చిన 165 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 541 ఇరాన్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని వెల్లడించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :