Kakani Goverdhan Reddy: కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులకు తాను భయపడేది లేదని, ఎన్ని కేసులనైనా చట్టపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కోవూరులో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో బాలిక వివరాలు బహిర్గతం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా, శుక్రవారం ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
Read Also: Electricity Contract Workers Protest: కలెక్టరేట్ ఎదుట విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
పోలీసు యంత్రాంగం గాడి తప్పింది
విచారణ అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో పని చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై పనిగట్టుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోక్సో చట్టంపై కనీస అవగాహన ఉన్న తాము ఎక్కడా బాలిక వివరాలను వెల్లడించలేదని, అసలు మీడియా సమావేశమే నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు.
గంజాయిపై విమర్శలు
రాష్ట్రంలో గంజాయి సంస్కృతి గతంలో పెద్ద నగరాలకే పరిమితమై ఉండేదని, కానీ కూటమి పాలనలో అది మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిందని కాకాణి ఆరోపించారు. అధికార పార్టీ నేతలు కూడా ఈ దారుణానికి గంజాయే కారణమని వ్యాఖ్యానించారని, వారిని ఎందుకు విచారించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. బాధితుల ఆవేదనను వ్యక్తం చేస్తే కేసులు పెట్టడం దారుణమన్నారు.
Kakani Goverdhan Reddy: జగన్ పాలన చూసి నేర్చుకోండి
ప్రజల ఆదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని, ప్రస్తుత ప్రభుత్వానికి పరిపాలన చేతకాకపోతే ఆయనను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కాకాణి తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: