हिन्दी | Epaper

Maoist Leader Ganapathi: ఇక గణపతిపైనే కన్ను!

Tejaswini Y
Maoist Leader Ganapathi: ఇక గణపతిపైనే కన్ను!

Maoist Leader Ganapathi: ఈ ఏడాది మార్చి నెలాఖరుకు దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తా మని కేంద్రం ప్రకటించనందుకు అనుగుణంగా ఆపరేషన్ కగార్ 2 ను మొదలు పెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు వరుసగా లొంగిపోతుండడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఇదే సమయంలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు నాయకత్వం వహించిన ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతిని కూడా లొంగిపోయేలా చేయాలన్నది పోలీసుల వ్యూహంగా కనిపిస్తోంది.

Read also: Tirumala: వేదాశీర్వచనానికి మేలాఛాట్ వస్త్రాల కొరత!

Maoist Leader Ganapathi: Now all eyes are on Ganapathi!
Maoist Leader Ganapathi: Now all eyes are on Ganapathi!

గణపతితో పాటు మావోయిస్టు పార్టీలో మరో 12 మంది నేతలే మిగిలివుండగా వీరిని కూడా లొంగిపోయేలా చేసేందుకు పోలీసులు వ్యూహాలు చేస్తున్నారు. ఇందులో గణపతి మినహా మిగతా వారంతా వారం పది రోజుల్లో లొంగిపోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిన ఏకైక అగ్రనేత గణపతి. గణపతి కోసం తెలంగాణ, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఎపి పోలీసులు గాలిస్తున్నారు. వీరితో పాటు కేంద్ర బలగాలు కూడా గాలిస్తున్నాయి. ఆయన ఎక్కడున్నాడనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఇక గణపతి గురించి కొన్ని విషయాలు తాజాగా వెలుగు చూస్తున్నాయి.

బీర్పూర్ గ్రామం గణపతి స్వస్థలం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగవూర్ మండలం బీర్పూర్ గ్రామం గణపతి స్వస్థలం. ఆయనకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు వున్నారు. వ్యవసాయ కుటుంబంలో సంపన్న వర్గానికి చెందిన గణపతి 1971లో డిగ్రీ పాస్ అయిన తరువాత ప్రభ్వుత పాఠశాలలో స్కూల్ అసిస్టంట్గా ఉద్యోగం వచ్చింది. మొదటి పోస్టింగ్ కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ సమితిలోని ఎలిగేడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చారు. అయితే బిఇడి పూర్తి చేయక పోవడంతో టీచర్ ట్రైనింగ్ కోసం గణపతితో పాటు మరి కొందరు ఉపాధ్యాయులను 1973లో వరంగల్ లోని ఖాజీపేటలో గల సెంట్ గాబ్రియల్ బిఇడి శిక్షణా కేంద్రానికి ఇన్ సర్వీస్ అభ్యర్థుల కోటాలో ప్రభుత్వం పంపింది. ఇక్కడే గణపతి మావోయిస్టుగా మారేందుకు బీజం పడింది.

కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడ్డ పరిచయం

ఇదే ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా వున్న కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడ్డ పరిచయం గణపతి సహా అనేక మంది యువ ఉపాధ్యాయులను నక్సలిజం వైపు నడిపించింది. అప్పట్లో కొన్ని చోట్ల జరిగిన కొన్ని ఘటనలు గణపతి ఓవైపు టీచర్గా ఉద్యోగం చేస్తూనే నక్సలిజంలో చురుకుగా పాల్గొనేలా చేసింది. 1977 సెప్టెంబరు ఏడవ తే దీన కరీంనగర్ జిల్లా తపాలాపూర్లో జరిగిన ఐదుగురు భూస్వాముల హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పట్లో భూస్వామిగా పే రొందిన పీతాంబరరావును నక్సలైట్లు మొదట హత్య చేశారు. దీని తరువాత ఆయన దశదిన కర్మ రోజున జరిగిన కార్యక్రమం సందర్భంగా అంటే సెప్టెంబరు ఏడవ తేదీన ఆయన ముగ్గురు కుమారులతో పాటు పట్వారిని, ఆయన కుమారుడిని నక్సలైట్లు హత్య చేశారు.

ఈ కేసులో గణపతితో పాటు మరికొందరు అరెస్టు అయ్యారు. తరువాత ఇదే కేసులో కొండపల్లి సీతారామయ్య కూడా అరెస్టయ్యారు. తపాలాపూర్ ఘటన తరువాత గణపతి నక్సలిజంలో పూర్తిగా చేరి అజ్ఞాతంలో వెళ్లారు. కాగా టీచర్గా గా చేరే నాటికే గణపతికి విజయతో వివాహం అవడంతో పాటు ఒక కుమారుడు వున్నాడు. గణపతి కుమారుడు విదేశాల్లో తన కుటుంబంతో వున్నట్లు సమాచారం. గణపతి కోసం గాలిస్తున్న పోలీసులు ఆయన కుమారుడి చూకీ కోసం కూడా ఆరా తీస్తున్నారు. కాగా గణపతి ముగ్గురు అక్కలలో ఇద్దరు మరణించగా తమ్ముడు కూడా చనిపోయాడని కుటుంబీకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870