Apple: భారత ఎగుమతుల రంగంలో యాపిల్ ఐఫోన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2025 సంవత్సరంలో దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన ఉత్పత్తిగా ఐఫోన్ నిలిచింది. పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం, గత ఏడాది భారత్లో తయారైన సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.9 లక్షల కోట్ల) విలువైన ఐఫోన్లు విదేశాలకు పంపించబడ్డాయి. వీటిలో పెద్ద భాగం అమెరికాకు ఎగుమతి అయ్యాయి.
Read Also:Cash withdrawal using Aadhaar: కార్డు లేకపోయినా నగదు విత్డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

ఈ పరిణామంతో ఆటోమోటివ్ డీజిల్ను వెనక్కి నెట్టి, స్మార్ట్ఫోన్లు దేశంలోనే అత్యధికంగా ఎగుమతి అయ్యే విభాగంగా మారాయి. 2025లో భారత్ నుంచి మొత్తం 30.13 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లు ఎగుమతి కాగా, అందులో సుమారు 76 శాతం వాటా యాపిల్ ఐఫోన్లదే కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వ పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకం, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకునే యాపిల్ వ్యూహాలు ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఐఫోన్ తయారీకి కేటాయించిన ఐదేళ్ల పీఎల్ఐ ప్రోత్సాహకాల గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది.
ప్రస్తుతం భారత్లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో మూడు, ఫాక్స్కాన్ ఆధ్వర్యంలో రెండు కలిపి మొత్తం ఐదు ఐఫోన్ అసెంబ్లీ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటికి అనుబంధంగా 45కి పైగా కంపెనీలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, విడిభాగాలను సరఫరా చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లోనూ ఐఫోన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025లో భారత్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్గా ఐఫోన్ 16 నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. భారత్లో గత డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు ఆదాయం సాధించామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రెండంకెల వృద్ధి నమోదైందని, ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్తో పాటు సేవల విభాగంలోనూ గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు. ఈ నెల 26న ముంబైలో మరో యాపిల్ స్టోర్ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: