Hyderabad: తెలంగాణ (TG) ప్రజలకు శుభవార్త. నగరంలో ఇప్పటికే సనత్ నగర్ టిమ్స్ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల ఉగాది సందర్భంగా ఈ హాస్పిటల్ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి మల్టీ స్పెషాలిటీ చికిత్సలు ఉచితంగా అందనున్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఉచిత ల్యాబ్ పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు, క్లిష్టమైన సర్జరీలు ఇక్కడ నిర్వహించనున్నారు.
Read Also: Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్

సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ పనులు వేగవంతం
సనత్ నగర్తో పాటు అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,196 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. 12 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో, వెయ్యి పడకల సామర్థ్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్, ప్లంబింగ్ వంటి తుది దశ పనులు జరుగుతున్నాయి. దీనిని కూడా వచ్చే నెలలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుమారు 53 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూ.968 కోట్లతో సనత్ నగర్ టిమ్స్ నిర్మాణమైంది. ఇందులో 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోగులతో పాటు వారి సహాయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ సదుపాయాన్ని కల్పించారు. నిమ్స్ (NIMS) నుంచి అనుభవజ్ఞులైన వైద్యులను ఇక్కడికి బదిలీ చేయనున్నారు, తద్వారా 24 గంటల పాటు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయి.
21 ఎకరాల్లో ఎల్బీ నగర్ టిమ్స్
మరోవైపు ఎల్బీ నగర్లో 21 ఎకరాల్లో రూ.1,011 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న టిమ్స్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ఆసుపత్రులన్నీ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రజలకు మాత్రమే కాకుండా, జిల్లాల నుంచి వచ్చే పేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం భారమవ్వదు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: