ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పీడిస్తున్న రక్తపోటు (బిపి) సమస్యకు వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. సాధారణంగా హైపర్ టెన్షన్ ఉన్నవారు జీవితాంతం ప్రతిరోజూ టాబ్లెట్లు వాడాల్సి ఉంటుంది. అయితే, ఇకపై ఈ రోజువారీ ఇబ్బంది నుంచి విముక్తి లభించే అవకాశం కనిపిస్తోంది. ఏడాదికి కేవలం రెండు ఇంజెక్షన్లు తీసుకుంటే చాలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి.

అమెరికాకు చెందిన రోష్ అండ్ అల్నైలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ‘జిలెబెసిరన్’ (Zilebesiran) అనే సరికొత్త ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది. ఇది అత్యాధునిక ఆర్ఎన్ఏ (RNA) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. మన శరీరంలో కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే ‘యాంజియోటెన్సినోజెన్’ అనే ప్రొటీన్ రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణమవుతుంది. ఈ ఇంజెక్షన్ నేరుగా ఆ ప్రొటీన్ ఉత్పత్తికి అడ్డుకట్ట వేయడం ద్వారా బీపీని అదుపులో ఉంచుతుంది. ఇప్పటికే జరిగిన క్లినికల్ ట్రయల్స్లో ఒక ఇంజెక్షన్ ఇస్తే సుమారు ఆరు నెలల పాటు దాని ప్రభావం సమర్థంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Municipal elections results : కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?
ప్రస్తుతం ఈ జిలెబెసిరన్ ఇంజెక్షన్ మూడో దశ ప్రయోగాల్లో (Phase 3 Trials) ఉంది. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయితే, సమీప భవిష్యత్తులోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రతిరోజూ మందులు వేసుకోవడం మరిచిపోయే వారికి లేదా ప్రయాణాల్లో ఇబ్బంది పడే వారికి ఇది ఒక వరంగా మారనుంది. అయితే, ఈ ఇంజెక్షన్ ధర మరియు ఇతర దుష్ప్రభావాల (Side Effects) పై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విధానం అందుబాటులోకి వస్తే హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com