తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ మాట తీరు చూస్తుంటే ఆయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేక డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నారా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. సమాజం పట్ల కనీస బాధ్యత లేకుండా, చదువుకున్న వ్యక్తి మాట్లాడే భాష ఇది కాదని సీఎం మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, స్థాయిని దిగజార్చి మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
BRS vs Congress Municipal Elections: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ తీరుపై విరుచుకుపడుతూ, ఆయన మాటలపై నార్కోటిక్స్ బ్యూరో విచారణ జరపాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “హోప్ (Hope) లేని వాడే ఇలాంటి అసంబద్ధ ప్రేలాపనలు చేస్తాడని, వారిది గంజాయి బ్యాచ్” అంటూ సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరోలా ప్రవర్తించడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని లూటీ చేసిన వారు, ఇప్పుడు ప్రజల క్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరగా, ఇలాంటి విమర్శలకు ప్రజలే మున్సిపల్ ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటీఆర్, తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని.. ఇలాంటి వారి గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటూ, విషం చిమ్మే రాజకీయాలు చేసే వారికి ఈ నెల 13న వెలువడే ఫలితాలు షాక్ ఇస్తాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com