తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు కీలక విన్నపం చేశారు. ప్రజలు తమ పట్టణాల అభివృద్ధిని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ఆయన కోరారు. గత పదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, అధికార కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే స్థానిక సంస్థలకు నిధుల ప్రవాహం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం భావోద్వేగాలకు లోనుకాకుండా, ఎవరు పని చేస్తారో చూసి నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
BRS vs Congress Municipal Elections: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. దాదాపు 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జీవనాడి అయిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్న హామీని కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని భావించే బీజేపీ నేతలు, ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడని వారు, ఇప్పుడు మున్సిపాలిటీల్లో ఓట్లు అడిగే హక్కు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ వరదల సమయంలో బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. గతంలో వరద బాధితులకు అండగా ఉంటామని, “బండికి బండి ఇస్తాం” అంటూ ప్రగల్భాలు పలికిన వారు, ఆ తర్వాత రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని వారు, ఎన్నికలప్పుడు మాత్రం లేనిపోని హామీలతో వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే సత్తా ఒక్క కాంగ్రెస్కే ఉందని, పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి హస్తం పార్టీకి మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com