తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘ఫోన్ ట్యాపింగ్’ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేసీఆర్ను ఒక జాతిపితగా, ఉద్యమకారుడిగా అభివర్ణిస్తూ.. అటువంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఉద్యమకారులు అని వారికి వారే రాసుకుంటున్నారు తప్ప, ప్రజలు అలా భావించడం లేదు” అని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నోటీసులు ఇస్తే దానిని ఎదుర్కోవాలి కానీ, ఉద్యమం పేరుతో తప్పించుకోవాలని చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
YSRCP: చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు
కేసీఆర్ను విచారించడమంటే తెలంగాణ చరిత్రను కించపరచడమేనన్న విపక్షాల వాదనను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. నోటీసులు ఇస్తే గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరమని, దాని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో తేలాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘జాతిపిత’ అనే బిరుదును తమకు తామే తగిలించుకుంటే అది చెల్లుబాటు కాదని రేవంత్ ఎద్దేవా చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, సిట్ విచారణలో అనేక కీలక అంశాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక అధికారుల అరెస్టులు, వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలకు ఉచ్చుగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే.. ఈ కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, ఆధారాలు ఉంటే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. రానున్న రోజుల్లో సిట్ విచారణ ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com