ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ, కాకినాడ జిల్లాలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తుని నియోజకవర్గ పరిధిలోని మన్యం ప్రాంతమైన సార్లంకపల్లె గ్రామంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఆ ఊరి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. పండగ పూట కొత్త బట్టలు కట్టుకుని, పిండివంటలతో సంతోషంగా గడపాల్సిన వేళ.. దాదాపు 40 కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయి. పండగ సామాగ్రి కోసం గ్రామస్థులంతా సమీపంలోని తుని పట్టణానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. వారు తిరిగి వచ్చేసరికి తమ కలల సౌధం, కష్టార్జితం అంతా బూడిద కుప్పగా మారిపోవడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి.
KTR Warning : జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమమే – కేటీఆర్
ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు చెలరేగి, అవి పక్కపక్కనే ఉన్న ఇళ్లకు వేగంగా విస్తరించినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో ఇళ్లు దట్టంగా ఉండటం, గాలి వేగం తోడవడంతో మంటలను అదుపు చేయడం అసాధ్యంగా మారింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, భౌగోళిక పరిస్థితులు ఆటంకంగా మారాయి. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని నుండి ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి, నివాసాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రస్తుతం ఆ గ్రామం స్మశాన వాటికను తలపిస్తోంది. పండగ వేళ ఆకలి తీర్చే అన్నం గిన్నె నుంచి, ఒంటిపై ఉన్న నగలు, దాచుకున్న నగదు వరకు అన్నీ బూడిదయ్యాయి. కనీసం కట్టుకోవడానికి మరో జత బట్టలు కూడా లేని దీనస్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు తక్షణమే స్పందించి, బాధితులకు తాత్కాలిక నివాసాలు, ఆహారం మరియు ఇతర నిత్యావసర వస్తువులను అందజేయాలని స్థానికులు కోరుతున్నారు. మారుమూల గ్రామాల వరకు అగ్నిమాపక సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com