తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా మౌనం పాటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఈ నెల 21వ తేదీన జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో మళ్లీ రాజకీయంగా క్రియాశీలకం కాబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ప్రభుత్వ వైఫల్యాలపై ‘గులాబీ బాస్’ తన గళాన్ని విప్పనున్నారు. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వానికి మూలమైన నదీ జలాల అంశాన్ని అస్త్రంగా చేసుకుని, మరో విడత ‘జల ఉద్యమానికి’ శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగే ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
Share Market: JK, CEAT, MRF టైర్ స్టాక్స్ షేర్లు లాభాల్లో
ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా నదీ జలాల నిర్వహణను KRMBకి అప్పగించడంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి తాకట్టు పెట్టిందని, దీనివల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. అలాగే, దాదాపు 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలో 90 టీఎంసీల కోసం తాము పోరాడితే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరించడం దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు.

నదీ జలాల పరిరక్షణే లక్ష్యంగా మహబూబ్నగర్ లేదా నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించి, ప్రజల్లో చైతన్యం నింపాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎండగట్టడంతో పాటు, అవసరమైతే ఢిల్లీ వేదికగా నిరసనలు చేపట్టేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, రాష్ట్రవ్యాప్త పర్యటనలకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. 21వ తేదీన వెలువడే నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపుగా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com