PM Modi Oman honour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒమాన్ దేశం తన అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమాన్ (ఫస్ట్ క్లాస్)’ను ప్రదానం చేసింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ, ఇప్పటివరకు 29 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న నాయకుడిగా అరుదైన ఘనత సాధించారు. ఇది ఆయన వ్యక్తిగత దౌత్య నైపుణ్యానికి, అంతర్జాతీయ వేదికపై భారత్ పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మూడు దేశాల పర్యటనలో చివరి దశగా రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఒమాన్కు వెళ్లిన ప్రధాని మోదీకి ఈ పురస్కారం అందించారు. 1970లో ఒమాన్ వ్యవస్థాపకుడు సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్ ప్రారంభించిన ఈ పురస్కారం, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధం, ప్రపంచ శాంతికి విశేషంగా కృషి చేసిన వారికి అందజేస్తారు.
Read Also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi Oman honour) స్పందిస్తూ, ఇది భారత్–ఒమాన్ ప్రజల మధ్య ఉన్న అనురాగం, నమ్మకానికి ప్రతీక అని అన్నారు. “శతాబ్దాలుగా మన పూర్వీకులు సముద్ర వాణిజ్యం ద్వారా అనుసంధానమై ఉన్నారు. అరేబియా సముద్రం మన దేశాల మధ్య బలమైన వంతెనగా మారింది. ఈ గౌరవాన్ని భారత ప్రజలకు, మాండ్వీ నుంచి మస్కట్ వరకు ప్రయాణించి ఈ బంధానికి పునాది వేసిన మన పూర్వీకులకు అంకితం చేస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ పురస్కారం భారత్–ఒమాన్ మధ్య శతాబ్దాల నాటి స్నేహానికి గుర్తింపుగా అభివర్ణించింది. రెండు దేశాల మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలు పూర్తైన సందర్భంలో ఈ గౌరవం లభించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపింది. ఈ పురస్కారం భారత్–ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: