రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కి సంబంధించిన దరఖాస్తుల్లో ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారి నుంచి మొత్తం 71,670 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేసే వారు, ప్రైవేటు స్కూల్స్ లో పనిచేసే వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న వారు 49,236 మంది టెట్-2026 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే విద్యాబోధన చేస్తున్న వారు 22,434 మంది టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 71,670 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Read Also: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్
వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే పాఠాలు బోధిస్తున్న వారి నుంచి పేపర్-1 పరీక్షకి 15,672 మంది, పేపర్-2 పరీక్షకి 33,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకి కలిపి 11,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ప్రభుత్వం టీచర్లు 60,955 దరఖాస్తులను టెట్-2026కి చేశారు. ప్రైవేటు టీచర్లలో పేపర్-1కి 15,672 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 10,717 మంది దరఖాస్తు చేసుకున్నారు.

టెట్ దరఖాస్తుల వివరాలు
టెట్-2026కి దరఖాస్తు గడువు లోపు పేపర్-1కి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 27,389 దరఖాస్తులు రాగా.. ఇతరుల నుంచి 58,149 దరఖాస్తులు కలిపి మొత్తం పేపర్-1కి 85,538 దరఖాస్తులు వచ్చాయి. పేపర్-2కి సంబంధించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 44,281 దరఖాస్తులు రాగా.. ఇతరుల నుంచి 1,07,935 దరఖాస్తులతో కలిపి మొత్తం పేపర్-2కి 1,52,216 దరఖాస్తులు వచ్చాయి. పేపర్-1, 2కి కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు వచ్చాయి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం: ఉపాధ్యాయుల్లో ఆందోళన
టెట్పై (TET) సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు నేపథ్యంలో టెట్ జీఓలో సవరణలు చేసి కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది. టెట్ ఉత్తీర్ణత కాని పక్షంలో ఉద్యోగం వదులుకోవాలని తెలిపింది.
అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని చెబుతూనే.. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం మార్చి 31, 2010 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి టెట్ అవసరం లేదని ఎన్సీటీఈ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో (Notification) పేర్కొంది. అయితే దానిని పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 1న టెట్ తప్పనిసరి అంటూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు (Teachers) ఆందోళన చెందుతున్నారు.
2010 కంటే ముందు ఉన్న వారికి టెట్ అవసరం లేకపోవడంతో.. వారు ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఇప్పటికే 15 సంవత్సరాలు దాటిపోయింది. అంతకంటే ముందు ఉన్న టీచర్లుగా నియమితులైన వారు కూడా సుమారు 20 నుంచి 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. వారిలో సర్వీస్ మరో 10 నుంచి 12 ఏళ్ల వరకు ఉన్న వారు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సంవత్సరాలకుపైగా టీచింగ్ వృత్తిలో ఉన్నవారు కూడా ఇప్పుడు టెట్ పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. టెట్-2026 పరీక్షలను జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. టెట్-2026 ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: