తిరుపతి: భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి అమెరికన్ డాలర్లు చోరీచేసినా చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని, పోలీస్ కేసు నమోదైన తరువాత చట్టప్రకారం చర్యలు తీసుకోలేకపోవడం, రాజీచేయడం వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలో టీటీడీ (TTD) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని (Bhumana Karunakar Reddy) సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్న మీరు ఈ విషయాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించలేదని, పరకామణిలో కీలకమైన సి.వి. రవికుమార్ అమెరికన్ డాలర్లు దొంగతనం చేశాడని తెలిసినా తదుపరి చర్యలకు ఎందుకు బోర్డు అనుమతించకపోయిందని సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.
Read also : Latest news: Atchannaidu: పత్తి రైతులకు పూర్తి భరోసా

భూమన వాంగ్మూలం: ‘నా ప్రమేయం లేదు’
“రవికుమార్ అనే వ్యక్తి మీకు తెలుసా?” అనే ప్రశ్నలు వేయడంతో భూమన కరుణాకర్ రెడ్డి తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఓ బోర్డు సభ్యుడిగానే వ్యవహరించానని సమాధానం ఇచ్చారనేది తెలిసింది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయలేకపోవడం, ఆపై పోలీస్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారనే ఆరోపణలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడటంలో తన ప్రమేయం ఏమీ లేదనే వాదన వినిపించారు. 2023 ఆగస్టులో టీటీడీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా ఈ కేసుపై తాను పెద్దగా పట్టించుకోలేదనేది ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది.
ఉద్యోగుల సంక్షేమం, హిందూ ధర్మ పరిరక్షణ, దేవుని ఖ్యాతి వ్యాప్తిచేయడంపై, అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టానని సీఐడీకి భూమన వివరించారు. అంతేగానీ పరకామణి చోరీ కేసులో నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ఎవరినీ ఎప్పుడూ ఆదేశించలేదని, పోలీసు అధికారులతో తాను ఆ విషయం చర్చించలేదనేది, తన ప్రమేయం అస్సలు లేదని వెల్లడించారనేది తెలిసింది. దీంతో సీఐడీ అధికారులు మంగళవారం సాయంత్రం తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో అరగంటపాటు భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ చేసి, ఆ తరువాత ఆయన వాంగ్మూలం నమోదు చేసి పంపించేశారు. భూమన సీఐడీ విచారణ నుండి బయటకు వచ్చి నేరుగా కారు ఎక్కి వెళ్లిపోయారు.
కేసు పూర్వపరాలు, వివాదాస్పద రాజీ
2023లో తిరుమల పరకామణి భవనంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన సి.వి. రవికుమార్ (పెద్దజీయర్ మఠంలో ఉద్యోగి) దేవుని కానుకలనే చోరీ చేస్తూ అప్పట్లో విజిలెన్స్కు పట్టుబడ్డాడు. దీనిపై తిరుమల వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ వేసుకున్నారు. అయితే వడ్డీకాసుల వేంకటేశ్వరస్వామి సొమ్మును దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి అరెస్ట్ చేయకుండా కాపాడుతూ, చివరకు అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్, ఓ ఉన్నతాధికారి, విజిలెన్స్ అధికారులు కలిసి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకోలేదనేది ఆరోపణలు.
చోరీ కేసు రాజీ వెనుక రూ.14 కోట్ల రవికుమార్ ఆస్తులను శ్రీవారి కానుకగా దేవునికి విరాళంగా రాసివ్వడంలో అప్పటి బోర్డులో చైర్మన్, సభ్యులు కీలకంగా వ్యవహరించారనేది సమాచారం. ఆ బోర్డులో భూమన సభ్యుడిగా కూడా ఉన్నారు. 2023 ఆగస్టులో భూమన రెండవసారి చైర్మన్గా నియమితులయ్యారు. అప్పటికే ఈ కేసు ఓ కొలిక్కి చేరింది. అయితే ఈ చోరీ కేసు వెనుక భారీ మొత్తంలో లబ్ధిపొందారనేది శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, తదుపరి హైకోర్టు ధర్మాసనం విచారణకు సీఐడీని ఆదేశించడం జరిగింది.
సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సభ్యులు గత ఇరవై రోజులుగా దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. చోరీ కేసులో కీలకమైన, ఫిర్యాదుదారుడు పూర్వ ఏవిఎస్ వై. సతీష్ కుమార్ సీఐడీ విచారణకు రెండవసారి వస్తూ హత్యకు గురవడంతో ఈ కేసులో ఇప్పుడు మాజీలను విచారణ చేస్తున్నారు. భూమన విచారణలో తనకెలాంటి సంబంధంలేదని, పరకామణి చోరీ అనంతరం పరిణామాల్లో తన ప్రమేయం ఏమీ లేదనేది సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఇదంతా ఓ కుట్రతోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :