సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, అలాగే విదేశీ న్యాయ ప్రతినిధులు కూడా హజరయ్యారు.
Read Also: Dharmendra: 19ఏళ్ల వయసులోనే ధర్మేంద్ర పెళ్లి
ఈ సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ, స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పంచుకున్నారు.హర్యానాలోని హిసార్ జిల్లా పెత్వార్ గ్రామంలోని తన పాత ఇంటి వద్ద బయట కూర్చుని జస్టిస్ కాంత్ (Justice Suryakant) తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. “నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి. నేను ఇక్కడే పుట్టాను. పాఠశాలకు వెళ్లడానికి ఈ వీధుల గుండానే నడిచేవాడిని” అని ఆయన తెలిపారు.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన.. తన చిన్న స్టడీ రూమ్ను చూపించారు. అంత చిన్న గదిలోనూ తాను ముగ్గురు స్నేహితులతో కలిసి చదువుకునే వాడినని పేర్కొన్నారు. “అప్పుడు మా గ్రామంలో విద్యుత్ సరఫరా చాలా తక్కువగా ఉండేది. అందుకే మేము ఎప్పుడూ విద్యుత్పై ఆధార పడలేదు. మట్టి దీపాల వెలుగులోనే చదువుకునే వాళ్లం” అని ఆయన గుర్తు చేసుకున్నారు.న్యాయమూర్తి పాత్ర గురించి, న్యాయవ్యవస్థ గురించి తనకు ఏమాత్రం అవగాహన లేని గ్రామంలో తాను పెరిగానని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
సీజేఐ అవుతానని కలలో కూడా అనుకోలేదు
“నేను పెద్దయ్యాక సీజేఐ అవుతానని అస్సలు అనుకోలేదు. కలలో కూడా ఊహించలేదు. ఆ రోజుల్లో గ్రామంలో ప్రతి ఒక్కరూ మెట్రిక్యులేషన్ తర్వాత ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే అనుకునేవారు. నేను ఉన్నత విద్య చదువుతానని చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు ఒప్పుకోవడం నా అదృష్టం” అని ఆయన అన్నారు. మొదట తన సోదరులు ఎంఏ(జియోగ్రఫీ) చేయమని కోరినా.. తానైతే న్యాయవాదానికే మొగ్గు చూపినట్లు తెలిపారు.

1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినట్లు వివరించారు. హిసార్ జిల్లా కోర్టులో తన వృత్తిని ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత్.. నాలుగు నెలల ప్రాక్టీస్ తర్వాత సీనియర్ తరఫున ఒక చిన్న కేసు వాదించారు. ఆయన వాదనను మెచ్చుకున్న న్యాయమూర్తి.. జిల్లాలోని సీనియర్ న్యాయవాదులందరినీ పిలిచి “ఈ యువకుడిని ఇక్కడ ఆపకండి.
తక్కువ కాలంలోనే వృత్తిలో విజయం
హైకోర్టుకు వెళ్లడానికి అతన్ని ప్రోత్సహించండి” అని సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తనకు హైకోర్టులో ఎవరూ తెలియకపోయినా.. సీనియర్ న్యాయవాదుల సహకారంతో 1985లో చండీగఢ్కు మకాం మార్చారు. అతి తక్కువ కాలంలోనే ఆయన వృత్తిలో విజయం సాధించి.. 2000వ సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోనే అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా నియమితులు అయ్యారు.2018లో జస్టిస్ సూర్యకాంత్.. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆపై ఒక సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
రాష్ట్రాల గవర్నర్ల అధికారాలపై ఇటీవల ఇచ్చిన చారిత్రక తీర్పు, వలసరాజ్యాల నాటి రాజద్రోహం చట్టాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలు వంటి పలు కీలక తీర్పులలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. న్యాయవాదుల సంఘాల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేయాలని ఆదేశించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సామాన్య నేపథ్యం నుంచి దేశంలోనే అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: