మహిళల వన్డే ప్రపంచకప్ (WWC 2025) విజేత, తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీ చరణికి (Sree Charani) ఏపీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ. 2.5 కోట్లు క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. కడపలో నివాస స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం శ్రీచరణి మీడియాకు వెల్లడించింది.
Read Also: CMO: ఏపీ సచివాలయాల పేరును మార్చలేదు: సీఎంఓ
అలాగే మంత్రి లోకేశ్ (Minister Lokesh) కూడా ఈ విషయమై ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. “శ్రీచరణి అచంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్ను గర్వపడేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె అద్భుతమైన విజయాన్ని గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది” అంటూ మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
అంతకుముందు శ్రీ చరణికి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. స్వరాష్టానికి చేరుకున్న శ్రీ చరణికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయం (Gannavaram Airport) లో రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఏసీఏ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
నారా లోకేష్ పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు
విమానాశ్రయం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) తో కలిసి శ్రీచరణి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడిని శ్రీచరణి, మిథాలీ రాజ్ కలిసారు. ఈ సందర్భంగా శ్రీచరణిని చంద్రబాబు అభినందించారు. ఆమె ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడిన చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ముఖ్యంగా తన మామ తనను క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.
భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు. ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని కలిసినప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు.ఇక, ఇవాళ సాయంత్రం కడపలో ఏసీఏ, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీ సన్మాన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: