ప్రేమకు హద్దులు లేవని నిరూపిస్తూ, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో(West Bengal) ఇద్దరు యువతులు పెద్దల అభ్యంతరాలను, సాంఘిక కట్టుబాట్లను ఎదురొడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మందిర్ బజార్కు చెందిన రియా సర్దార్, సుందర్బన్స్లోని బకుల్తాలాకు చెందిన రాఖీ నస్కర్ ప్రేమించుకున్నారు. ఈ స్వలింగ ప్రేమను మొదట పెద్దలకు తెలియజేయగా, రియా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారు. అయితే, రాఖీ తల్లిదండ్రులు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు.
దీంతో రాఖీ ఇల్లు వదిలి రియా దగ్గరకు వచ్చింది. రియా కుటుంబం మరియు స్థానిక క్లబ్ సభ్యులు ఈ ప్రేమకు అండగా నిలిచారు. ఇరుగుపొరుగు వారి సహకారంతో, స్థానికంగా ఉన్న ఒక ఆలయంలో రియా, రాఖీ వివాహానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ వారు పూల దండలు మార్చుకుని భార్యాభర్తలుగా మారారు. స్థానికులు ఇలాంటి వివాహాలను టీవీలు, వార్తల్లో మాత్రమే చూశామని, కానీ అభ్యంతరం లేకుండా వారికి మద్దతు ఇచ్చామని తెలిపారు. రియా మాట్లాడుతూ, తాము గత రెండేళ్లుగా కలిసి జీవిస్తున్నామని, కలిసి జీవితాన్ని పంచుకోవడానికి లింగం అడ్డంకి కాదని, ప్రేమే సరిపోతుందని అభిప్రాయపడింది. రాఖీ కూడా తన తండ్రి అంగీకరించకపోవడం వల్లే ఇల్లు వదిలి వచ్చి రియాను వివాహం చేసుకున్నానని తెలిపింది. స్థానికుడు జలధర్ మండల్ మాట్లాడుతూ, తాము ఈ జంటకు సహాయం చేశామని, వారు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Read also: మా అమ్మకు మీరే హీరో మోది జీ సార్

స్వలింగ వివాహం చట్టబద్ధత మరియు పూర్వ ఉదాహరణలు
పశ్చిమ బెంగాల్లో (West Bengal) ఇద్దరు మహిళలు వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్లో కూడా బీర్భూమ్కు చెందిన నమితా దాస్, సుష్మితా బెనర్జీ సోషల్ మీడియా ద్వారా పరిచయమై, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా, బీర్భూమ్లో ఒక పురుషుడు తన పురుష భాగస్వామిని పెళ్లి చేసుకోవడానికి తన భార్యకు విడాకులు ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రస్తుతానికి చట్టబద్ధత లేదు. సుప్రీంకోర్టు(Supreme Court) రెండేళ్ల క్రితం ఈ విషయంపై తీర్పునిస్తూ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం లేదా ప్రత్యేక వివాహాల చట్టాన్ని మార్చడం అనేది పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. కోర్టులు చట్టాలను రూపొందించలేవని పేర్కొంది. అయితే, స్వలింగ సంపర్కులు వివక్షకు గురికాకుండా వారి హక్కులను కాపాడాలని మరియు వారిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. స్వలింగ సంపర్కులు తమ వివాహానికి రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు ఉందని చెప్పుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: