యాదాద్రి భువనగిరి జిల్లా:(Yadadri) మద్యం సేవించిన మత్తులో ఇద్దరు వ్యక్తుల అరాచకానికి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి నరకం చూసింది. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్కు చెందిన ఒక పేయింటింగ్ కూలీ కుటుంబం నివాసానికి ఎదురుగానే, కెమికల్ పరిశ్రమలో దినసరి కూలీలుగా పనిచేసే మధ్యప్రదేశ్కు(Madhya Pradesh) చెందిన దినేశ్ కోల్ (46), శివరాజ్ కోల్ (45) ఉంటున్నారు.
Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశం

లడ్డూ ఇప్పిస్తానని ఎత్తుకెళ్లి అఘాయిత్యం
శుక్రవారం ఉదయం ఆ నాలుగేళ్ల చిన్నారి తన తోబుట్టువులతో కలిసి ఇంటి ఎదురుగా ఆడుకుంటోంది. ఆ సమయంలో లడ్డూ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి దినేశ్ కోల్, శివరాజ్ కోల్ చిన్నారిని తమ ఇంట్లోకి ఎత్తుకెళ్తుండగా, ఓ బాలిక చూసింది. కొద్దిసేపటికి చిన్నారి కేకలు వేయడంతో ఆమె తల్లి వచ్చి ఆరా తీయగా విషయం తెలిసింది. స్థానికులు వెంటనే తలుపులు పగులగొట్టి చూడగా, చిన్నారిపై వారు అఘాయిత్యానికి పాల్పడినట్లు గమనించి, వెంటనే డయల్ 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
నిందితుల అరెస్ట్, చిన్నారికి చికిత్స
చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మథకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పీఎస్ లో కేసు నమోదైంది. చిన్నారిని చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్కు పంపించారు. నిందితులిద్దరూ బాగా మద్యం సేవించినట్లు తెలిసింది. మెడికల్ రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ పై అవగాహన కల్పించాలని, ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే షీ టీమ్ లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: