ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదిపై ఉన్న ప్రముఖ ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజీకి మరోసారి ప్రమాదం తప్పింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నదిలో నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగింది. ఈ క్రమంలో ఓ భారీ బోటు నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి బ్యారేజీ వైపుకు వస్తున్నట్టు సమాచారం అందింది. వెంటనే APSDMA (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ల సాయంతో ఆ బోటు కదలికలను గుర్తించి, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్దను గుర్తించారు. సమయోచితంగా చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
Latest News: AP: నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా
బోటు బ్యారేజీ గేట్ల దిశగా వెళ్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని SDRF బృందాలు తక్షణమే సన్నద్ధమయ్యాయి. గజ ఈతగాళ్లు, రక్షణ సిబ్బంది బోటును నియంత్రణలోకి తెచ్చి, కృష్ణా ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. బోటు పరిమాణం చాలా పెద్దది కావడంతో రక్షణ చర్యలు కఠినంగా మారాయి. అధికారులు రాత్రంతా పహారా కాసి, నది ప్రవాహ దిశను నిరంతరం పర్యవేక్షించారు. ఈ చర్యలతో ప్రకాశం బ్యారేజీ గేట్లు, నిర్మాణాలు ఏవీ దెబ్బతినకుండా రక్షించగలిగారు. ప్రజలు, ఇంజనీరింగ్ అధికారులు ఈ సంఘటనపై ఊపిరి పీల్చుకున్నారు.

గత ఏడాది కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వరదల సమయంలో మరో బోటు ప్రకాశం బ్యారేజీ గేట్లలో చిక్కుకుపోయి, దాన్ని బయటకు తీయడానికి అధికారులు ఎనిమిది రోజులపాటు శ్రమించాల్సి వచ్చింది. ఆ అనుభవం ఈసారి APSDMA మరియు SDRF బృందాలకు ఉపయోగపడిందని అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వరదలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు డ్రోన్ల సాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రజలు, మత్స్యకారులు నదిలోకి వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఘటనతో రాష్ట్ర విపత్తు నిర్వహణ వ్యవస్థ చురుకైన చర్యల వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.