పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న యువత, తల్లిదండ్రులు ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు కొత్త లక్ష్యంగా మారుతున్నారు. ఇటీవల ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, బెట్టింగ్ మోసాలు తగ్గడంతో, నేరగాళ్లు ఇప్పుడు “వివాహం” (Marriage) అనే సెంటిమెంట్ను దుర్వినియోగం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నామని చెప్పి నమ్మకం పొందడం, ప్రేమ, బంధం పేరుతో డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి.
Read also: Mohul Choksi: బ్యారక్ నంబర్ 12లో మెహుల్ చోక్సీ విచారణకు భారత్ సన్నాహాలు!

మాటలతో మోసం మొదలు
మంచి సంబంధం చేజారిపోకూడదన్న ఆతృతలో చాలా మంది తల్లిదండ్రులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ చూసి నమ్మకం పెంచుకుంటారు. ఫోటోలు, ఉద్యోగ వివరాలు నిజమని భావించి అవతలి వ్యక్తిని సంప్రదిస్తారు. అక్కడినుంచే మోసగాళ్ల ఆట మొదలవుతుంది.
విదేశీ వృత్తి అంటూ మాయ మాటలు
“విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాం”, “తర్వాత భారత్కి వస్తాం, పెళ్లి చేసుకుందాం” అంటూ నమ్మకం తెచ్చుకుంటారు. క్రమంగా చాట్లు, కాల్స్ ద్వారా సాన్నిహిత్యం పెంచుకుంటారు. నకిలీ ఫోటోలు పంపిస్తూ “మన ఆలోచనలు కలిశాయి” అని నమ్మబలుకుతారు. తర్వాత పుట్టినరోజులు, పండుగల పేరుతో గిఫ్టులు పంపించి భావోద్వేగ బంధం పెంచుతారు.
తర్వాత డబ్బు వసూలు
ఒకసారి నమ్మకం ఏర్పడిన తర్వాతే అసలు మోసం మొదలవుతుంది. “అత్యవసర పరిస్థితి ఉంది”, “తల్లి అనారోగ్యంతో ఉంది”, “వీసా సమస్య పరిష్కరించాలి” వంటి కారణాలతో డబ్బు అడుగుతారు. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్కి చెందిన ఓ వైద్యురాలు రూ.10 లక్షలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 20కి పైగా మహిళలను మోసగించినట్లు బయటపడింది.
వేరే రూపాల్లోనూ మోసాలు
కొంతమంది మహిళలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. సికింద్రాబాద్కి చెందిన ఇద్దరు మహిళలు 50 మందికి పైగా పురుషులను మోసం చేసిన కేసు పోలీసులు నమోదు చేశారు. అలాగే ఓ యువకుడు మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన యువతి పాకిస్థాన్ మోడల్ ఫోటో ఉపయోగించి రూ.25 లక్షలు దోచుకున్న ఘటన కూడా నమోదైంది.
సైబర్ నిపుణుల సూచనలు
- మ్యాట్రిమోనీ (Matrimony) సైట్లలో పరిచయం అయిన వ్యక్తులు డబ్బు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలి.
- వ్యక్తిగత ఫోటోలు లేదా వ్యక్తిగత వివరాలు పంపకూడదు.
- అవతలి కుటుంబాన్ని నేరుగా కలవకముందు ఏ నిర్ణయం తీసుకోవొద్దు.
- “విదేశాల్లో ఉన్నాను” అనే మాటలను నమ్మేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
- అనుమానం వస్తే సైబర్ పోలీసు లేదా డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాలి.
మ్యాట్రిమోనీ మోసాలు అంటే ఏమిటి?
పెళ్లి పేరుతో నమ్మకం తెచ్చుకుని డబ్బు దోచుకునే సైబర్ మోసాలు.
ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి?
నకిలీ ప్రొఫైల్స్, ఫోటోలతో సాన్నిహిత్యం పెంచి, అత్యవసరం పేరుతో డబ్బు తీసుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: