ప్రతి విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్(Certificate) అత్యంత కీలకం. ఇందులోని వివరాలే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు, విదేశాల్లో ఉన్నత చదువులతో సహా అన్ని ధ్రువపత్రాలకు ప్రామాణికంగా నిలుస్తాయి. తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తెలియక చేసే పొరపాట్ల వల్ల ధ్రువపత్రాల్లో దోషాలు దొర్లవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి, 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థుల పేర్లు, వివరాల మార్పులు-చేర్పులకు తెలంగాణ విద్యాశాఖ నవంబర్ రెండో వారం వరకు గడువు ఇచ్చింది.
Read Also: Bigg Boss 9: దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్
ఆధార్ ఆధారంగా వివరాల నమోదు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. యూడైస్ (UDISE) వెబ్సైట్ ఆధారంగా గురుకుల, కస్తూర్బా, ప్రభుత్వ, ప్రైవేట్, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలను నమోదు చేస్తున్నారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లలో అక్షరాలు, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వంటి వివరాలను ఆధార్ కార్డు(Aadhaar card) సహాయంతో సరి చేసుకోవచ్చు. కులం పేరు తప్పుగా ఉంటే, సంబంధిత మండలం తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. పదో తరగతి సర్టిఫికెట్ ప్రాధాన్యత దృష్ట్యా తల్లిదండ్రులు, హెడ్ మాస్టర్లు తప్పకుండా ఈ వివరాలను తనిఖీ చేసుకోవాలి.

ధ్రువపత్రంలో తప్పులు: సవరణ విధానం
చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి పదో తరగతి ధ్రువపత్రాన్నే ప్రామాణికంగా చూస్తారు. అందులో తప్పుగా ముద్రితమైతే, ఫలితాలు విడుదలైన నాటి నుంచి మూడేళ్లలోపు మాత్రమే ఈ పొరపాటును సవరించుకోవడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ కోసం విద్యార్థులు ముందుగా టెన్త్ పాసైన పాఠశాల హెచ్ఎం ధ్రువీకరణతో ఎంఈవో, అక్కడి నుంచి డీఈవో ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE) కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల రిజిస్టర్లో నమోదైన తేదీకి భిన్నంగా ఉంటేనే ధ్రువపత్రంలోని పుట్టిన తేదీని మారుస్తారు. డీఎస్ఈ ఆమోదం తెలిపితే ఎస్ఎస్సీ బోర్డు అధికారులు కొత్త సర్టిఫికెట్ను జారీ చేస్తారు. ఈ సవరణకు ఎటువంటి ఫీజు వసూలు చేయరు.
అధికారులు, నిరుద్యోగుల ఆందోళన
“ఒకసారి పదో తరగతి సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత మార్పులు చేసుకోవడం అంత సులువు కాదు. అందువల్ల ఇప్పుడే పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు పిల్లల అన్ని వివరాలను సరి చూసుకోవాలి” అని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. ప్రతి సంవత్సరం దాదాపు 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులు తమ మార్కుల మెమోలో వివరాలు తప్పుగా ఉన్నాయని డీఎస్ఈ కార్యాలయానికి వస్తుంటారని అధికారులు చెబుతున్నారు.
పదో తరగతి వివరాల్లో మార్పులు చేసుకోవడానికి చివరి గడువు ఎప్పుడు?
నవంబర్ రెండో వారం వరకు ఈ మార్పులు, చేర్పులకు గడువు ఇచ్చారు.
విద్యార్థుల వివరాలను ఏ ఆధారంగా సరి చేసుకోవచ్చు?
ఆధార్ కార్డు సహాయంతో విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలను సరి చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: