అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పొగడ్తల వర్షం కురిపించారు. ట్రంప్ను “నిజమైన శాంతికాముకుడు” అని అభివర్ణించిన ఆయన, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించారని కితాబిచ్చారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్లో జరిగిన గాజా సదస్సులో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే, షరీఫ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాజా సదస్సులో ప్రపంచ నాయకులను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పోషించిన పాత్రను కొనియాడారు. “అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో జరిగిన అవిశ్రాంత ప్రయత్నాల వల్ల శాంతి సాధ్యమైంది. ఇది సమకాలీన చరిత్రలో ఒక గొప్ప రోజు. ఆయన నిజంగా శాంతికాముకుడు” అని షరీఫ్ అన్నారు.
Read Also: Data Center: టెక్ ప్రపంచంలో ఏపీకి ఘనత: నారా లోకేష్

“వావ్! నేను ఇది ఊహించలేదు”: ట్రంప్
అంతటితో ఆగకుండా, “ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకోకపోయి ఉంటే, భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ తీవ్ర స్థాయికి చేరేది. ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎవరూ మిగిలి ఉండేవారు కాదు” అని ఆయన పేర్కొన్నారు. మధ్య ఆసియాలో శాంతిని ప్రోత్సహించడంలో ట్రంప్ చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా, పాకిస్థాన్ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిందని షరీఫ్ గుర్తుచేశారు. “ఆయన శాంతిని ప్రేమించే తీరుకు మనం చేయగలిగిన కనీస గౌరవం ఇదే” అని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. షరీఫ్ ప్రశంసలకు ట్రంప్ చిరునవ్వుతో స్పందిస్తూ, “వావ్! నేను ఇది ఊహించలేదు” అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలకు అవమానకరం
షరీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన ట్రంప్ను అనవసరంగా పొగుడుతూ పాకిస్థానీయుల పరువు తీస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థానీ రాజకీయ నాయకుడు, చరిత్రకారుడు అమ్మర్ అలీ జాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “షెహబాజ్ షరీఫ్ అనవసరంగా ట్రంప్ భజన చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలకు అవమానకరం” అని విమర్శించారు.
24 కోట్ల పాకిస్థాన్ ప్రజలకు అవమానం
మరోవైపు, కాలమిస్ట్ ఎస్ఎల్ కాంతన్, పాక్ ప్రధాని తీరును తప్పుబట్టారు. “ట్రంప్కు ఎప్పుడు బూట్లు పాలిష్ చేయించుకోవాలనిపించినా, పాకిస్థాన్ ప్రధానిని పిలుస్తారు. భౌగోళిక రాజకీయాల్లో ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు” అని ఆయన ఎక్స్లో ఆరోపించారు. “షెహబాజ్ షరీఫ్ 24 కోట్ల పాకిస్థాన్ ప్రజలకు అవమానం” అని అసద్ అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: