కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavams) బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవాలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అశోక్ సింఘాల్ ఆధ్వర్యం వహించారు.ఉత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానించే శాస్త్రోక్త కార్యక్రమం భాగంగా గరుడ ధ్వజ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకం అనేది అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలందరికీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పంపినట్లుగా భావిస్తారు. అర్చకులు దీనిని ప్రత్యేకంగా వివరించారు.

శేష వాహనంపై ఊరేగింపు
ధ్వజారోహణ అనంతరం స్వామివారి మూర్తులను పెద్ద శేష వాహనంపై ఊరేగించారు. ఈ ఊరేగింపుతో భక్తులు ఆలయ ప్రాంగణం నిండా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు.గురువారం ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు పవిత్ర స్నపనోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు.సెప్టెంబర్ 26న ఉదయం 8 గంటలకు సింహ వాహనం భక్తుల ముందుకు రానుంది. మధ్యాహ్నం 1 గంటకు స్నపనోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 27 కార్యక్రమాలు
27న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు స్నపనం జరగనుంది. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.28న ఉదయం 8 గంటలకు స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ వేళలో జరిగే గరుడ సేవకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.29న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం ఉంటుంది. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు దర్శనం ఇస్తారు.
సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు
30న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేళలో ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోతుంది.అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం ఘనంగా జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం ప్రారంభం అవుతుంది. వేలాది భక్తులు ఈ రోజు ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఉంటుంది.అక్టోబర్ 2న ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Read Also :