తమిళనాడు (Tamil Nadu) లో ఓ దారుణం చోటుచేసుకుంది. మైలదుత్తురై జిల్లా ఆదియమంగళం గ్రామంలో ప్రేమ వ్యవహారం భయంకర హత్యకు దారి తీసింది. యువతిని ప్రేమించిన యువకుడిని ఆమె కుటుంబ సభ్యులే హత్య చేసిన ఘటన స్థానికులను కుదిపేసింది. తమ కుమార్తెను ప్రేమించడమే కాకుండా రహస్యంగా పెళ్లికి సిద్ధమయ్యాడన్న సమాచారంతో ఓ కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రియురాలి తల్లిదండ్రులే ఈ హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ఆదియమంగళం గ్రామానికి చెందిన వైరముత్తు(28), మాలిని(26) గత — పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వైర ముత్తు (Vaira Muthu) ఐటీఐ చదువుతూ వాహన మెకానిక్గా కూడా పనిచేస్తున్నాడు. అదేప్రాంతానికి చెందిన గ్రాడ్యుయేట్ మాలిని (26)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ యువతి చైన్నె (Chennai) లోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరిది ఒకే కులమైనప్పటికీ, వీరి ప్రేమ వ్యవహారానికి పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముత్తు మెకానిక్ కావడంతో ఆ యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ ప్రేమ వ్యవహారంపై తరచూ గొడవలు
అయితే వైరముత్తును ప్రేమించిన మాలిని (Malini) అతనిని వదులు కోవడానికి సిద్ధంగా లేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అతడితో పరిచయం మానుకోవాలని పదేపదే హెచ్చరించారు. ఇరు కుటుంబాల మధ్య ఈ ప్రేమ వ్యవహారంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 12వ తేదీన ఆ యువతి వైర ముత్తు వద్దకువెళ్లినట్టు సమాచారం. చివరకు వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరడంతో పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టారు.ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు మాలినిని వైరముత్తుకు అప్పజెప్పారు.

పోలీస్ స్టేషన్ బయటే వైరముత్తును చంపేస్తానని మాలిని తల్లి విజయ బెదిరించడం కలకలం రేపింది. పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆ యువతి తల్లిదండ్రులు వైరముత్తును హతమార్చేందుకు వ్యూహం పన్నారు.ఎప్పటిలాగే మాలిని మరునాడు ఉదయం ఉద్యోగం చేసేందుకు చెన్నై వెళ్లడానికి సిద్ధమైంది. ఆమెను బస్సు ఎక్కించి తిరుగు పయనంలో ఉన్న వైర ముత్తుపై మంగళవారం తెల్లవారు జామున దాడి జరిగింది.
వారి నుంచి తప్పించుకుని గ్రామంలోకి పరుగు తీసినప్పటికి
ద్విచక్ర వాహనం (Two-wheeler) పై వస్తున్నఅతడ్ని మాలిని సోదరులు గ్రామ శివారులో కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని గ్రామంలోకి పరుగు తీసినప్పటికి వారు అతడ్ని వదలలేదు. వారు వెంటాడి వేటాడి మరీ హతమార్చారు. మాలిని సోదరులు కత్తులు, గొడ్డళ్లతో నరికి నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
వైర ముత్తు కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ యువతి తల్లిదండ్రులు పత్తా లేకుండా పోవడంతో ఈ హత్యను వారే చేయించి ఉంటారన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పరువు హత్యపై పలు రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. రోడ్డుపై ధర్నా నిర్వహించాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో విరమించాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: