తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజల కోసం మరో ప్రజాహిత కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నెల చివరి నాటికి ఇందిరమ్మ క్యాంటీన్ల(Indiramma Canteens ) ద్వారా కేవలం రూ.5కే టిఫిన్ను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన అల్పాహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
60 చోట్ల ప్రారంభం
ప్రారంభ దశలో, పాత స్టాళ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 ప్రాంతాల్లో ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇడ్లీ, పొంగల్, పూరీ, ఉప్మా వంటి వివిధ రకాల అల్పాహారాలు ఈ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయి. ఈ పథకం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

సబ్సిడీ భారం GHMCదే
ఒక్కో బ్రేక్ఫాస్ట్కు వాస్తవంగా రూ.19 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇందులో రూ.14 భారాన్ని జీహెచ్ఎంసీ భరించనుంది. లబ్ధిదారులు కేవలం రూ.5 చెల్లిస్తే సరిపోతుంది. ఈ భారీ సబ్సిడీని జీహెచ్ఎంసీ భరిస్తుంది, తద్వారా సామాన్యులకు ఆర్థిక భారం లేకుండా చూస్తుంది. ఈ పథకం ద్వారా కార్మికులు, విద్యార్థులు మరియు ఇతర ప్రజానీకానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది.