హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail ) నిర్వహణలో తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఎల్అండ్టీ స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్రం ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న మూడు కారిడార్లలో ఒక్కటి కూడా లాభాల్లో లేనట్టు తెలిపింది. ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికే సరిపోతుందని, ఆపరేషన్ల ఖర్చులను మించిన ఆదాయం రాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
ప్రభుత్వాలపై బకాయిల భారం
2017లో ప్రారంభమైన మెట్రో ప్రాజెక్ట్కు 2020 నాటికి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎల్అండ్టీకి చెల్లించాల్సి ఉంది. అలాగే, కేంద్రం నుంచి రావాల్సిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మరింతగా పెరిగాయని పేర్కొంది. ఈ బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని లేఖలో ఎల్అండ్టీ వెల్లడించింది. టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకపోవడం, ప్రయాణికుల సంఖ్య ఊహించిన స్థాయికి చేరకపోవడం కూడా నష్టాలను పెంచే కారణాలుగా పేర్కొంది.
విస్తరణపై అనిశ్చితి
రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే డీపీఆర్ను కేంద్రానికి పంపించినప్పటికీ, అనుమతులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎల్అండ్టీ లేఖ పెద్ద ట్విస్ట్గా మారింది. ప్రస్తుత లైన్లు నష్టాల్లో ఉన్నందున, కొత్త విస్తరణ సాధ్యాసాధ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పర్పస్ వెహికిల్ (SPV) ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం చేస్తేనే తాము కొనసాగించగలమని ఎల్అండ్టీ స్పష్టంచేసింది. లేకపోతే మెట్రో నిర్వహణను వదిలివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.