హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి సైబర్ నేరగాళ్లు (Cyber criminals) తమ దాడిని కొనసాగించారు. ఈసారి ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో లింక్లు పంపి ఒకరి ఖాతా నుంచి భారీ మొత్తాన్ని లాక్కున్నారు.బహదూర్పురాకు చెందిన వ్యక్తికి నేరగాళ్లు మెసేజ్ పంపారు. అందులో పీఎం కిసాన్ యోజన సౌకర్యం పొందాలంటే లింక్ ఓపెన్ చేయమని సూచించారు. బాధితుడు ఆ లింక్ క్లిక్ చేయగానే అతని ఫోన్ నియంత్రణ పూర్తిగా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లింది.కొద్దిసేపటిలోనే అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. రూ.2.90 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయి. షాక్ అయిన బాధితుడు వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాడు. కానీ అధికారులు కేవలం రూ.9 వేల్ని మాత్రమే ఆపగలిగారు. మిగతా మొత్తం మోసగాళ్ల చేతికి వెళ్లిపోయింది.
ఓటీపీతో డబ్బు దోపిడీ
పోలీసుల దర్యాప్తులో మాల్వేర్ యాప్ ద్వారా ఫోన్ పూర్తిగా హ్యాక్ అయినట్లు తేలింది. లావాదేవీలకు వచ్చే ఓటీపీలను వాడుకొని నేరగాళ్లు డబ్బును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.ఇలాంటి ఘటనతో పాటు జియాగూడలో మరో మోసం వెలుగుచూసింది. జీవన్సాథి మ్యాట్రిమోని సైట్లో పరిచయమైన ఓ మహిళ యువకుడిని మోసం చేసింది. మొదట మాటలు కలిపి విశ్వాసం సంపాదించింది. ఆ తర్వాత క్రిప్టో పెట్టుబడులు పెట్టమని ప్రలోభ పెట్టింది.
లాభాల వలలో చిక్కుకున్న యువకుడు
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆమె చెప్పింది. ‘డెక్స్’ అనే యాప్ లింక్ పంపి ఇన్స్టాల్ చేయమంది. యువకుడు నమ్మి యాప్ డౌన్లోడ్ చేశాడు. తర్వాత పలు దఫాలుగా రూ.1.56 లక్షలు ఆమె సూచించిన ఖాతాల్లో జమ చేశాడు.యాప్లో డబ్బు పెరిగినట్లు స్క్రీన్పై కనిపించింది. కానీ విత్డ్రా ప్రయత్నం విఫలమైంది. ఇంకా మరింత డబ్బు పెట్టమని ఒత్తిడి చేయడంతో ఇది మోసం అని గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
పోలీసుల హెచ్చరిక
ఇలాంటి లింక్లు లేదా అపరిచిత యాప్లు ఇన్స్టాల్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల మెసేజ్లు నమ్మడం వల్లే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆన్లైన్లో ఏదైనా ఆఫర్ వస్తే ముందుగా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.
Read Also :