అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) మళ్లీ వార్తల్లో నిలిచారు. కోర్టు విచారణ సందర్భంగా ఆయన తన గోడును న్యాయమూర్తి ఎదుట వెళ్లబోసుకున్నారు. జైలు పరిస్థితులు భరించలేనివిగా ఉన్నాయని, ఇక బతకలేనని బాధతో చెప్పారు. అంతేకాదు, తాను అనుభవిస్తున్న దుర్భర జీవితం కన్నా విషం ఇవ్వడం మేలని కోర్టు ఎదుట విన్నవించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు
మంగళవారం బెంగళూరులోని 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (64th City Civil and Sessions Court, Bangalore) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దర్శన్ను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. కోర్టు ఎదుట మాట్లాడిన ఆయన తన అనుభవాలను వివరించారు.“చాలా రోజులుగా నేను సూర్యరశ్మి చూడలేదు. జైలు గదిలో ఫంగస్ పెరిగిపోతుంది. బట్టలు కూడా దుర్వాసన వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. దయచేసి నాకు కనీసం విషం ఇవ్వండి. ఇక్కడ జీవితం అసహనంగా ఉంది” అని తీవ్ర ఆవేదనతో తెలిపారు.
న్యాయమూర్తి స్పందన
దర్శన్ చేసిన విన్నపంపై కోర్టు న్యాయమూర్తి స్పందించారు. ఆయన భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, అలాంటివి సాధ్యం కాదు. మీ కోరిక నెరవేర్చలేము అని స్పష్టం చేశారు.చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుడిని 2024 జూన్లో కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో దర్శన్ పేరు బయటకు వచ్చింది. ఈ ఘటనతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల సమాచారం ప్రకారం, దర్శన్ సన్నిహితురాలైన పవిత్రా గౌడకు రేణుకాస్వామి అసభ్య సందేశాలు పంపాడు. ఆ కారణంగానే ఈ హత్య జరగిందని విచారణలో తేలింది.
హైకోర్టు బెయిల్, సుప్రీంకోర్టు రద్దు
ఈ కేసులో దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 14న ఆ బెయిల్ను రద్దు చేసింది.అంతేకాదు, ఆయనకు జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దర్శన్ను మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.ఈ కేసులో 13వ, 14వ నిందితులు వేసిన డిశ్చార్జి పిటిషన్లను కోర్టు విచారించింది. అయితే అభియోగాల నమోదును సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
ప్రత్యేక సౌకర్యాల కోసం దర్శన్ అభ్యర్థన
దర్శన్ మరో విన్నపం కూడా కోర్టు ఎదుట ఉంచారు. తాను బళ్లారి జైలుకు తరలించవద్దని అభ్యర్థించారు. అలాగే కనీసం బెడ్, పరుపు వంటి సౌకర్యాలు ఇవ్వాలని కోర్టు వద్ద వినతి పెట్టారు.దర్శన్ చేసిన ఈ భావోద్వేగ విన్నపం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అభిమానులు ఆయనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సినీ వర్గాలు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also :