నేపాల్ రాజధాని ఖాట్మండూలో పరిస్థితులు తీవ్రతరమవడంతో దేశ విమాన రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ తగిలింది. నగరంలో చెలరేగిన హింసాత్మక అల్లర్ల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు అత్యవసరంగా మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక దేశీయ, అంతర్జాతీయ (International) విమాన సర్వీసులు అడ్డంకులకు గురయ్యాయి. ప్రముఖ భారతీయ విమానయాన సంస్థ ఇండిగో(IndiGo) తమ ఖాట్మండూ సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో – “ప్రయాణికుల భద్రత మా మొదటి ప్రాధాన్యం. ఖాట్మండూ విమానాశ్రయం మూసివేత కారణంగా సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని పేర్కొంది.
పరిస్థితులు అనుకూలిస్తే
ఇండిగో (IndiGo) ప్రయాణికులకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. టికెట్ బుక్ చేసుకున్న వారు కంపెనీ వెబ్సైట్ ద్వారా ప్రత్యామ్నాయ విమానం ఎంచుకోవచ్చు లేదా పూర్తి రీఫండ్ పొందవచ్చు. అదనంగా, పరిస్థితిని దగ్గరగా గమనిస్తూ, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితులు అనుకూలిస్తే సేవలను వెంటనే పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. తాజా సమాచారానికి అధికారిక ఛానెల్స్ను మాత్రమే ఫాలో కావాలని సూచించింది. ఖాట్మండూ విమానాశ్రయం మూతపడడంతో అనేక అంతర్జాతీయ విమానాలను సమీపంలోని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు. ఉదాహరణకు, దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం (FZ539) మధ్యాహ్నం 3:25 గంటలకు లక్నోలో ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి బయల్దేరిన థాయ్ లయన్ ఎయిర్ విమానం (TLM220) కూడా మధ్యాహ్నం 3:05 గంటలకు లక్నోకు చేరింది. ఢిల్లీ నుంచి ఖాట్మండూ వెళ్ళాల్సిన ఇండిగో ఫ్లైట్ (6E1153) మధ్యాహ్నం 2:40 గంటలకు లక్నోలో ల్యాండ్ కాగా, ముంబై నుంచి బయల్దేరిన మరో ఇండిగో విమానాన్ని (6E1157) మొదట లక్నోకు, ఆపై ఢిల్లీకి మళ్లించారు.

News Telugu
ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితులు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఖాట్మండూకు చేరాల్సిన అనేక మంది ప్రయాణికులు లక్నోలోనే నిలిచిపోయారు. వారికి విమానయాన సంస్థలు తాత్కాలిక వసతి, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం నేపాల్ (Nepal) లోని రాజకీయ అల్లర్లు హింసాత్మక రూపం దాల్చడం వల్ల దేశంలో అంతర్గత భద్రతా పరిస్థితులు సవాలుగా మారాయి. ప్రభుత్వం పలు నగరాల్లో కర్ఫ్యూలు విధించినప్పటికీ, అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా విమానాశ్రయం ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో స్పష్టత లేదు. అధికారులు చెబుతున్నదాని ప్రకారం, పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు విమాన రాకపోకలపై అనిశ్చితి కొనసాగుతుందని అంచనా. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: