దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) తన వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో ఉండేదో ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) మరోసారి గుర్తుచేశారు. ఆమె చివరి చిత్రం మామ్ కోసం పారితోషికంలో భాగం వదులుకోవడం ఆమె అంకితభావానికి నిదర్శనమని చెప్పారు.బోనీ కపూర్ వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీదేవి తన ఫీజు నుంచి ₹50 నుంచి ₹70 లక్షలు వదులుకున్నారని తెలిపారు. కారణం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ చిత్రానికి రెహమాన్ తప్పనిసరిగా అవసరమని శ్రీదేవి భావించారని ఆయన చెప్పారు. బడ్జెట్ కారణంగా తాను తొలుత వెనుకడినా, తన ఫీజులోంచే సర్దుబాటు చేసి రెహమాన్ను ప్రాజెక్టులోకి తీసుకువచ్చారని బోనీ గుర్తుచేశారు.
పాత్రలో మునిగిపోయిన శ్రీదేవి
నటనలోకి దిగితే శ్రీదేవి పూర్తిగా ఆ పాత్రలోనే మునిగిపోయేదని బోనీ తెలిపారు. మామ్ షూటింగ్ కోసం జార్జియా వెళ్లినప్పుడు, తాను బస చేస్తున్న హోటల్ గదిలోకి తన భర్తకే అనుమతి ఇవ్వలేదని చెప్పారు. “పాత్రపై దృష్టి మరలకూడదు” అనేదే ఆమె ఉద్దేశమని ఆయన వివరించారు.శ్రీదేవి కేవలం నటనలోనే కాకుండా భాషలపై కూడా ఎంతో శ్రద్ధ చూపించేవారని బోనీ గుర్తుచేశారు. తెలుగు, మలయాళ చిత్రాల్లో తనే డబ్బింగ్ చెప్పుకునే ఆమె, ఉచ్ఛారణ తప్పులేకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా మలయాళ డబ్బింగ్ సమయంలో ఒక డబ్బింగ్ ఆర్టిస్టును పక్కనే కూర్చోబెట్టుకుని ప్రతి పదాన్ని సరిచూసుకునేవారని చెప్పారు.
హిందీ డబ్బింగ్ కోసం ప్రత్యేక శిక్షణ
హిందీ డబ్బింగ్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు శ్రీదేవి ఒక టీచర్తో డబ్బింగ్ థియేటర్లోనే శిక్షణ తీసుకున్నారని బోనీ వెల్లడించారు. తన పెర్ఫార్మెన్స్ను మరింత సహజంగా చూపించేందుకు ఎలాంటి కష్టాన్నైనా భరించేవారని చెప్పారు.శ్రీదేవి త్యాగం, నిబద్ధత, పట్టుదల – ఇవన్నీ ఆమెను అతిలోకసుందరిగా నిలబెట్టాయని బోనీ కపూర్ అన్నారు. ఒక చిత్రం కోసం తన పారితోషికాన్ని వదిలేయడం, పాత్రలో పూర్తిగా లీనమవడం, భాషపై శ్రద్ధ చూపించడం – ఇవన్నీ ఆమె కళ పట్ల ఎంతటి గౌరవం చూపించేదో సూచిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
Read Also :