ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని బరేలీ జిల్లాలో ఒక చిన్నారి జీవితం చీకట్లలో మునిగిపోయిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 11 ఏళ్ల వయసున్న బాలికపై పదేపదే లైంగిక దాడులు జరగడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం ఇటీవల బహిర్గతమవగా, సమాజం మొత్తం షాక్కు గురైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అకాల ప్రసవంతో ఒక శిశువుకు జన్మను ఇచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ పసికందు పుట్టిన 30 నిమిషాలకే మరణించింది. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
ఆ బాలికపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,ఈ అమానవీయ ఘటనకు కారణమైన 31 ఏళ్ల రషీద్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రషీద్ అనే 31 ఏళ్ల వ్యక్తి పలు నెలలుగా ఆ బాలికపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. పండ్లు ఇస్తానని నమ్మించి తన ఇంటికి పిలిచినప్పుడు లైంగిక దాడి చేశాడు. అంతేకాకుండా, ఆ దృశ్యాలను వీడియోగా తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. భయంతో చిన్నారి ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయింది.
ఇదే అదునుగా చేసుకున్న రషీద్ (Rashid) పదే పదే బాలికను ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ముందుగా బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పగా.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలుసుకుని షాక్ అయ్యారు. అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పగా.. కన్నీటిపర్యంతం అయ్యారు. ఇదెలా సాధ్యమైందంటూనే గుండెలు బాదుకున్నారు. తమ చిన్నారి జీవితాన్ని కాపాడమని కోరారు.

నెలలు నిండకముందే పుట్టడం వల్ల కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది
ఈక్రమంలోనే వైద్యులు ఆ బాలికకు గర్భస్రావం చేయాలనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోగా.. ఏడు నెలలకే ఆమె ఒక అకాల శిశువుకు జన్మను ఇచ్చింది. అయితే నెలలు నిండకముందే పుట్టడం వల్ల కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు రషీద్ గురించి తెలుసుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేశారు.ఈ దారుణమైన నేరానికి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పలు సామాజిక వర్గాలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శిశువు డీఎన్ఏ నమూనాలను సేకరించి, నిందితుడు రషీద్తో సరిపోల్చి తండ్రిని నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి పేరు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: