ఉత్తర భారతదేశం (North India) గత కొన్ని రోజులుగా భారీ వర్షాల (Heavy rains) ధాటికి అల్లకల్లోలమవుతోంది. రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కలిసి పలు రాష్ట్రాల్లో విపత్తు సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఒడిశా సహా అనేక రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.జాతీయ రాజధానిలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది నీటిమట్టం వేగంగా పెరిగి 206.03 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయిని మించిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. చారిత్రాత్మక పాత రైల్వే వంతెనను (లోహా పుల్) మూసివేసి, నదీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురుగ్రామ్లో అండర్పాస్లు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. కదర్పూర్ డ్యామ్ దెబ్బతినడంతో సమీప గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
పంజాబ్లో 1988 తర్వాత అత్యంత భయంకర వరదలు
పంజాబ్లో పరిస్థితి మరింత తీవ్రమైంది. సట్లెజ్, బియాస్, రవి నదులు ఉప్పొంగి 12 జిల్లాలను ప్రభావితం చేశాయి. ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోగా, 2.56 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1988 తర్వాత ఇలాంటి పరిస్థితి చూడలేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సెప్టెంబర్ 7 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. హరియాణాలోనూ పరిస్థితి బీభత్సంగానే ఉంది. యమునానగర్, అంబాలా, కురుక్షేత్ర జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, బీఎస్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై, ఇప్పటివరకు 16,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కొత్త రికార్డులు సృష్టించాయి. 1949 తర్వాత ఆగస్టు నెలలో ఇంతటి వర్షపాతం (431.3 మి.మీ.) నమోదు కావడం ఇదే తొలిసారి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి అనేక రహదారులు దెబ్బతిన్నాయి. పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి యాత్రా మార్గం కూడా దెబ్బతినడంతో అధికారులు సెప్టెంబర్ 3 వరకు యాత్రను నిలిపివేశారు.
ఒడిశాలో వర్షాల బీభత్సం
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్, కటక్ నగరాలు నీటమునిగాయి. మల్కంగిరి జిల్లాలోని మోటు వద్ద కంగుర్కొండ వంతెన వరదకు కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.అరుణాచల్ ప్రదేశ్లో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
Read Also :