News Telugu: రేబిస్ అనేది ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి. ఒకసారి సోకితే దాదాపు ప్రాణాంతకమవుతుంది. ముఖ్యంగా వీధి కుక్కలు లేదా ఇతర జంతువుల కరిచిన తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. రోగి నీటిని భయపడటం, అధిక జ్వరం, అసహజ ప్రవర్తన వంటి లక్షణాలు కనిపించడం సాధారణం. అందుకే వైద్యులు రేబిస్ (Rabies) విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తుంటారు.

జగిత్యాలలో బాలుడి మరణం
తాజాగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు రక్షిత్ రేబిస్ లక్షణాలతో చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నెల క్రితం జరిగిన కుక్కల దాడి
స్థానికుల సమాచారం ప్రకారం, రక్షిత్పై సుమారు నెల క్రితం వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో బాలుడు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయాడు. కుక్క కరిచినట్లు (dog bite) పెద్దగా గమనించని తల్లిదండ్రులు గాయాలకు మాత్రమే సాధారణ చికిత్స చేయించారు. కానీ నిజానికి అప్పుడే రేబిస్ వ్యాధి సోకిన అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.
తీవ్ర జ్వరంతో నీటిని భయపడటం
గత రెండు మూడు రోజులుగా బాలుడికి జ్వరం రావడం, నీటిని చూస్తే భయపడటం, నాలుకను బయటకు తీయడం వంటి రేబిస్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
నిలోఫర్ ఆసుపత్రికి తరలింపు ప్రయత్నం
జగిత్యాల వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించి, వెంటనే హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే అంబులెన్స్లో హైదరాబాద్ వైపు తరలిస్తుండగా బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించి, మార్గమధ్యలోనే మృతి చెందాడు.
గ్రామంలో విషాదం – వైద్యుల హెచ్చరిక
ఈ ఘటనతో తుంగూర్ గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది. వైద్యులు మాత్రం కుక్క కాటు జరిగిన ప్రతిసారీ తక్షణమే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని, చిన్న గాయాలను కూడా నిర్లక్ష్యం చేయరాదని మళ్లీ ఒకసారి ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: