టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోవిడ్ కాలంలో మందుల అక్రమ నిల్వల కేసులో తనపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణను నిలిపివేయాలని గంభీర్ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఖండించింది. ఈ కేసు విచారణ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేసింది.విచారణ సందర్భంగా గంభీర్ న్యాయవాది.. తన క్లైంట్ ఒక మాజీ ఎంపీ అని, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్తో పాటు ప్రస్తుత హెడ్ కోచ్ అని, ఆయన సేవా కార్యక్రమాలు గుర్తించి ప్రస్తావించగా.. న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. పేరు చెప్పి కోర్టును ప్రభావితం చేయరాదని మందలించారు. అవి న్యాయ ప్రక్రియకు సంబంధించినది కాదని వ్యాఖ్యానించారు.గతంలో ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేను ఏప్రిల్ 9వ తేదీన కోర్టు రద్దు చేసింది. దీనిపై గంభీర్ తరపున మళ్లీ విచారణకు విజ్ఞప్తి చేయగా, దానిని కోర్టు ఆగస్టు 29న విచారిస్తానని తెలిపింది. గంభీర్ తరపు న్యాయవాదులు ట్రయల్ కోర్టు (Trial Court) లో విచారణను తిరిగి నిలిపివేయాలని కోరారు. హైకోర్టు అందుకు అంగీకరించలేదు. కానీ ఈ కేసు విచారణ త్వరలో జరుగుతుందని హామీ ఇచ్చింది.

గంభీర్ ఫౌండేషన్ తప్పు చేసిందని
వివరాల్లోకి వెళ్తే,2021 కరోనా రెండో వేవ్లో గౌతమ్ గంభీర్కు చెందిన ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసి పంపిణీ చేసిందని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ శాఖ (Delhi Drug Control Department) కేసు నమోదు చేసింది. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్’ నిబంధనలను ఉల్లంఘించారని తమ ఫిర్యాదులో పేర్కొంది.ఈ కేసు విషయంపై ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా.. మందుల కొరత ఉన్న సమయంలో ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల నిజమైన రోగులకు ఇబ్బందులు కలిగాయని కోర్టు అభిప్రాయపడింది. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తప్పు చేసిందని డ్రగ్ కంట్రోలర్ హైకోర్టుకు నివేదించింది.ఈ కేసుకు సంబంధించి గంభీర్ తరఫు న్యాయవాదులు నాలుగేళ్లుగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రజల సహాయార్థమే ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వచేసి పంపిణీ చేశారని, సేవా కార్యక్రమాలకు లైసెన్సులు అవసరం లేదని వాదించారు. అయితే ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఏ ఉద్దేశంతో చేసినా ఔషధాల నిల్వ, పంపిణీ విషయంలో చట్టపరమైన నియమాలు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: