News Telugu: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన స్మృతిని చిరస్థాయిగా నిలుపుకునేలా మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. నిరుపేదలు, బహుజనుల పక్షాన జీవితాంతం కృషి చేసిన నేతను కోల్పోవడం దేశానికి పెద్ద నష్టం అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మగ్దూం భవన్లో పార్థివదేహానికి పుష్పాంజలి
హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో ఉంచిన సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సందర్శించారు. ఆయనకు పుష్పాంజలి ఘటించి గౌరవం తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
జాతీయ నేతలతో సీఎం సంభాషణ
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ నాయకులు డి. రాజా, కె. నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సురవరం రెడ్డి గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన త్యాగస్ఫూర్తిని ప్రశంసించారు.
“సిద్ధాంతానికి అంకితం అయిన నాయకుడు” – రేవంత్ రెడ్డి
సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి జాతీయ రాజకీయాల వరకు ఒకే సిద్ధాంతంతో, నిరాడంబరంగా జీవించిన నాయకుడని సీఎం అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అహంకారం ప్రదర్శించలేదని కొనియాడారు. పాలమూరు జిల్లా బూర్గుల, జైపాల్ రెడ్డి లాంటి గొప్ప నాయకుల కోవలో సుధాకర్ రెడ్డి కూడా నిలిచారని తెలిపారు.
విలువలతో కూడిన నాయకులను గౌరవించే ప్రభుత్వం
సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలని సుధాకర్ రెడ్డి కోరగానే తక్షణమే అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. “కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, గద్దర్, జైపాల్ రెడ్డిల పేర్లను శాశ్వతంగా నిలిపాం. అదే విధంగా సుధాకర్ రెడ్డి గారిని గుర్తుంచుకునేలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది,” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంతాపం
సుధాకర్ రెడ్డి మరణం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాప సందేశం పంపినట్లు సీఎం తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయ రంగానికి తిరుగులేని లోటని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: