నెల్లూరు (రూరల్) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy), రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంపై తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. శ్రీకాంత్ తండ్రి విజ్ఞప్తి మేరకు తనం లేఖ ఇచ్చినప్పటికీ, ఆ లేఖను అధికారులు జూలై 16న తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జూలై 30న పెరోల్ మంజూరు చేయడం తనకు సంబంధం లేదని తెలిపారు.
ఈ విషయంపై మాట్లాడిన కోటంరెడ్డి, గతంలో కూడా శ్రీకాంత్ పెరోల్ కోసం చెవిరెడ్డి, కిలివేటి వంటి నాయకులు సిఫార్సులు చేశారని గుర్తు చేశారు. పెరోల్ అనుమతిపై తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, అధికార యంత్రాంగమే నిర్ణయం తీసుకుందని వివరించారు. అయినప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై లేఖలు ఇవ్వనని స్పష్టం
తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఇకపై ఎవరి కోసమూ పెరోల్ లేఖలు ఇవ్వనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులుగా వ్యవహరించే సమయంలో నిజాయితీ, పారదర్శకత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారం వెనుక ఉన్నవారిని ప్రభుత్వం పరిశీలించాలనీ, నిజాలను ప్రజలకు తెలియజేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.