తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల (Rains) కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KVReddy) సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ఎక్కడెక్కడ రోడ్లు కోతకు గురయ్యాయి, ఏయే ప్రాంతాల్లో ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది అనే విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదలు తగ్గుముఖం పట్టగానే వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ పనులు
ప్రస్తుతానికి ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా తెగిపోయిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కూడా చెప్పారు. అదే సమయంలో, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నిధుల కేటాయింపు, నివేదిక సమర్పణ
దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన నిధుల అంచనాలను త్వరగా సిద్ధం చేసి, తనకు సమర్పించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు.