ఏపీ లిక్కర్ (AP Liquor Scam)కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ఇప్పటికే ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు తాజాగా రెండోసారి కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో 200 పేజీలతో కూడిన మరో ఛార్జ్షీట్ (Charge sheet) ను వారు ప్రవేశపెట్టారు.
ముగ్గురు కీలక నిందితులపై ఆధారాలతో కూడిన వివరణ
ఈ ఛార్జ్షీట్లో బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పాత్రలపై ప్రత్యేకంగా వివరించారు. వారి మధ్య కమ్యూనికేషన్, టెక్నాలజీ ఆధారాల ఆధారంగా వారి ప్రమేయాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

కాల్ డేటా, గూగుల్ టేకౌట్, ల్యాప్టాప్ సమాచారం కీలకం
నిందితుల కాల్స్ డేటా రికార్డులు, గూగుల్ టేకౌట్ ఫైల్స్, ల్యాప్టాప్ డేటా సిట్ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ఈ ఆధారాల ద్వారా వారు ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అన్న సమాచారం స్పష్టంగా వెల్లడించబడింది.
లిక్కర్ పాలసీ రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి పాత్ర కీలకం
ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy) లిక్కర్ పాలసీ (AP Liquor Scam) రూపకల్పనలో ప్రతి దశలో జోక్యం చేసుకున్నారని సిట్ పేర్కొంది. పాలసీ ఎలా ఉండాలి, ఎవరికి అనుకూలంగా ఉండాలి వంటి అంశాల్లో ఆయన అనైతికంగా మద్దతు ఇచ్చారని ఆరోపించింది. సిట్ ఛార్జ్షీట్లో నిందితులు ఎవరెవరి వద్ద నుంచి ఎన్ని ముడుపులు తీసుకున్నారు?, ఆ డబ్బు ఎవరెవరికి చేరింది? అనే విషయాలను స్పష్టంగా ప్రస్తావించింది. ఈ అంశంలో స్పష్టతతో ఆధారాలను జోడించడంతో కేసు మరింత బలపడనుంది.
ప్రముఖ నేతలతో ఫోన్ సంభాషనలు కూడా ప్రస్తావనలోకి
విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో నిందితులు ఫోన్ సంభాషించినట్లు పేర్కొంటూ, వాటి కాల్ రికార్డులు సేకరించామని సిట్ తెలిపింది. వీటిలో ఉన్న అంశాలు విచారణకు కీలకంగా మారే అవకాశం ఉంది. నిందితులు బినామీ పేర్లతో వ్యాపార పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారని, ఈ విషయానికి సంబంధించి సాక్ష్యాలతో కూడిన ఆధారాలు కూడా రెండో ఛార్జ్షీట్లో పొందుపరిచారని సమాచారం.
ఇప్పటికే దాఖలైన మొదటి ఛార్జ్షీట్
గతంలో, జూలై 19న సిట్ అధికారులు 305 పేజీలతో కూడిన తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఛార్జ్షీట్లో మరిన్ని న్యాయపరమైన బలాన్ని కలిగించే అంశాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: