తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురం (Rasipuram) ప్రాంతంలో ఒక అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు సొంత కూతుళ్లను ఒక తండ్రి అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపిన అనంతరం తాను కూడా ఆత్మహత్య (suicide ) చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆర్థిక సమస్యలే కారణమా?
ఈ ఘాతుకానికి ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. తండ్రి తీవ్రమైన అప్పుల భారంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ముగ్గురు కూతుళ్లను హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరగడానికి ముందు భార్యను, కొడుకును ఒక గదిలో బంధించి, ఈ దారుణానికి ఒడిగట్టాడు. బంధించిన గది నుంచి భార్య, కొడుకు బయటకు రాగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులను కూడా విచారిస్తున్నారు. ఆర్థిక సమస్యలే ఈ దారుణానికి దారితీశాయా, లేక మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటన నామక్కల్ జిల్లా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also : Hyderabad Rains : హైదరాబాదులో దంచి కొట్టిన వర్షం