తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఆయన.. “కవిత గురించి మాట్లాడటానికి ఒక్క నిమిషం కూడా వృథా చేయలేం. ఆమెను పార్టీలో పెద్దగా ఎవ్వరూ చర్చించరు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
పార్టీలో ఉంటే ఎమ్ఎల్సీ.. బయటకు వెళ్లితే?
జగదీష్ రెడ్డి (Jagadeesh Reddy) వ్యాఖ్యల్లో కీలకంగా నిలిచింది “ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు,” అనే వ్యాఖ్య. దీని ద్వారా ఆయన కవితకు పార్టీలో ఇప్పుడు ఉన్న స్థాయి కంటే బలహీనతే ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో బీఆర్ఎస్లో కీలక నాయకురాలిగా ఉన్న కవితపై ఇలా వ్యాఖ్యానించడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
లేఖ లీక్ వివాదం
ఆ మధ్య కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో లీక్ కావడం, దీనిపై ఆమె పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి ఆమె పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య జగదీశ్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు, ఆమె పార్టీ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలకు తావిచ్చేలా ఉన్నాయి. మరి కవిత దీనికి ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
Read Also : Annadata sukhibhava – PM Kisan : కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!