ఆంధ్రప్రదేశ్లో లులు గ్రూప్ పెట్టుబడులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో లులు మాల్ (Lulu Mall)నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఈ సంస్థ, ఇప్పుడు విజయవాడ నగరంలో కూడా తమ మాల్ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని లులు గ్రూప్కు లీజుకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ భూమి – లులుకు లీజుకు
విజయవాడలో లులు మాల్ కోసం RTCకి చెందిన స్థలాన్ని ఎంచుకున్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రస్తుత నిర్మాణాలను ఇతర ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడ నగరంలో పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాలకు కొత్త ఊపొస్తుందని భావిస్తున్నారు. ఈ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించి, లులుకు మాల్ నిర్మాణానికి అనువుగా లీజుపై ఇవ్వనున్నారు.
పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యం
వాణిజ్య రంగానికి తోడు పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడనుందని అధికారులు చెబుతున్నారు. లులు మాల్ ద్వారా స్థానిక ప్రజలకు ఉన్నత స్థాయి షాపింగ్, వినోద సౌకర్యాలు లభించడంతో పాటు, వేలకొద్దీ ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి. విశాఖ, విజయవాడలో మాల్లు నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ప్రముఖ రిటైల్ హబ్గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు విజయవాడ నగర అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుంది.
Read Also : Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం?