హైదరాబాద్ నగర శివారులో శనివారం రాత్రి మత్తు మాయలో మునిగిన రేవ్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్ (Kondapur) లోని ఎస్వీ నిలయం అపార్ట్మెంట్లో రహస్యంగా నిర్వహించబడుతున్న ఈ పార్టీకి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.
విజయవాడ నుండి నిర్వాహకులు
పార్టీని విజయవాడ (Vijayawada)కు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిని అనుసరించిన కొంతమంది వారం చివరలో ప్రత్యేకంగా సంపన్న యువతను ఆహ్వానించి, గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం పార్టీకి హాజరైన 11 మంది ఈ ఘటనలో అదుపులోకి తీసుకోబడ్డారు. సమాచారం ప్రకారం, వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే.
తనిఖీల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలు స్వాధీనం
పోలీసులు అపార్ట్మెంట్లో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో మత్తు పదార్థాలు వెలుగులోకి వచ్చాయి. అందులో 2.080 కేజీల గంజాయి (2.080 kg of marijuana), 50 ఓజీల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల హైగ్రేడ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
అరెస్ట్ అయినవారిలో ప్రముఖ యువత
అధికారుల ప్రకారం, అరెస్ట్ అయిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్, ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతా, తేజ ఉన్నారు. వీరికి మత్తు పదార్థాలు సరఫరా చేసిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
నిందితుల కోసం గాలింపు
ఈ కేసులో ఇంకా మూడు మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిపై కూడా కేసు నమోదు చేసి గాలింపు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: PV Sindhu: లాల్దర్వాజలో పీవీ సింధు ప్రత్యేక పూజలు..