విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ (Kingdom ) జూలై 31న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ‘హృదయం లోపల’, ‘అన్న అంటేనే’ పాటలకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకోనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ‘కింగ్డమ్’ సినిమా టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చింది.
సింగిల్స్, మల్టీప్లెక్స్లలో ప్రత్యేక టికెట్ రేట్లు
ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం, ‘కింగ్డమ్’ సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజులపాటు టికెట్ రేట్ల పెంపు వర్తించనుంది. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్లలో రూ.75 అదనంగా చార్జ్ చేయడానికి అనుమతినిచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగ వంశీ నిర్మించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు, సినిమా రిలీజ్ ముందు అభిమానుల కోసం భారీ ప్రమోషన్లు కూడా ప్లాన్ చేస్తున్నారు.
తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
చిత్రబృందం ప్రకారం, జూలై 26న తిరుపతిలో ‘కింగ్డమ్’ ట్రైలర్ను భారీ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న అవకాశం ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం జోమోన్ టి.జాన్ మరియు గిరీష్ గంగాధరన్ నిర్వహించగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు వహించారు.
Read Also : Himachal Pradesh Floods : హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు 77 మంది మృతి