హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి (Osmania University graduation) ముఖ్య అతిథిగా ఇస్రో ఛైర్మన్ హాజరు కానున్నారు. యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఆగస్టులో నిర్వహించనున్నారు. 1917లో ఏర్పడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాత కోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభించింది.

84వ స్నాతకోత్సవ కార్యక్రమానికి అతిథిగావి నారాయణన్
ఆగస్టులో జరగనున్న 84వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయణన్ (ISRO Chairman Dr. V Narayanan) పాల్గొని ప్రసంగిస్తారని ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం ప్రకటించారు. యూనివర్సిటీ కులపతి(ఛాన్స్లర్) అయిన గవర్నర్ జిష్ణుదేవవర్మ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గత రెండేళ్లల్లో వివిధ కోర్సుల్లో పట్టభద్రులైన వారికి పట్టాలు, బంగారు పతకాలు, స్నాతకోత్సవ పట్టాలు (Graduation diplomas), పరిశోధక డిగ్రీలు అందించనున్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి (Osmania University graduation) సంబంధించి ఇప్పటికే విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలల్లో యూనివర్సిటీలో కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు, డిప్లొమాలు, బంగారు పతకాలను స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్నారు. నవంబర్ 1, 2023 నుండి ఆగస్టు 6, 2025 మధ్యకాలంలో పరిశోధక డిగ్రీ(పిహెచి) పొందిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. పట్టా పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థులు పట్టాలు పొందేందుకు దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 7 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఆలస్య రుసుముతో ఆగస్టు 12 వరకు అవకాశమిచ్చారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్ సైట్లో పొందవచ్చని యూనివర్సిటీ ప్రకటించింది .
Read hindi news: hindi.vaartha.com
Read also: TG Bonalu: పాతబస్తీలోని అన్ని ఆలయాల్లో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు